- పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’పై కీలక అప్డేట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు యువ దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ తిరిగి సెట్స్ పైకి వచ్చింది. కొంతకాలంగా షూటింగ్ నిలిచిపోయిన ఈ చిత్రం తాజాగా మళ్లీ ప్రారంభమైందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షూటింగ్ స్టార్ట్ అయిన ఫోటోను అభిమానులతో షేర్ చేస్తూ, “మళ్లీ మొదలైంది… ఈసారి ముగిద్దాం” అనే క్యాప్షన్ జత చేశారు.
తాజా షెడ్యూల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారా లేదా అన్నది మాత్రం అధికారికంగా తెలియరాలేదు. అయితే పవన్ ఎప్పుడు సెట్లో చేరతారన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది. అయితే, ‘ఓజీ’ షూటింగ్ రీషార్ట్ అయ్యిందనే వార్తే పవర్ స్టార్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేపిందనడం తప్పు కాదు.
ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్కు భారీ స్పందన రావడం తెలిసిందే. ఇటీవలే ‘హరిహర వీరమల్లును’ పూర్తిచేసిన పవన్, ఇప్పుడు ‘ఓజీ’పై ఫోకస్ చేశారనేది సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాలో పవన్ కల్యాణ్తో పాటు ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
Read : Pawan Kalyan : ఏఎం రత్నం, డీవీవీ దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ తో పవన్ భేటీ!